నారద వర్తమాన సమాచారం
రైస్ మిల్లులోని 110 బస్తాల రేషన్ (పిడిఎస్ ) బియ్యం స్వాధీనం
జూన్ :24.
పల్నాడు జిల్లా
ఈరోజు సత్తెనపల్లి మండలం కొమెరపూడి గ్రామంలో ఉన్న విఘ్నేశ్వర రైస్ మిల్లు యాజమాన్యం వారు రేషను బియ్యమును అక్రమముగా కొనుగోలు చేసి నిల్వ వుంచి రీసైక్లింగ్ చేసి అమ్ముచున్నారని రాబడిన విశ్వసనీయమైన సమాచారముతో ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్ మెంట్ డైరెక్టర్ జనరల్ వారి ఆదేశముల మేరకు, గుంటూరు రీజనల్ విజిలెన్స్ ఎన్ఫోర్స్ మెంట్ ఎస్.పి. కె.ఈశ్వరరావు పర్యవేక్షణలో విజిలెన్స్ ఎన్ఫోర్స్ మెంట్ అధికారులు, స్థానిక సివిల్ సప్ప్లైస్ డిప్యూటీ తహసీల్దార్ (సి ఎస్ డి టి ) తో కలసి పల్నాడు జిల్లా సత్తెనపల్లి మండలం కొమెరపూడి గ్రామంలో ఉన్న విఘ్నేశ్వర రైస్ మిల్లు ను తనిఖీ చేసినారు. తనిఖీ సమయములో మిల్లు యజమాని గంగాధర రెడ్డి హాజరులో లేరు. గుమాస్తా లేళ్ళ కృష్ణా రెడ్డి మిల్లు వ్యవహారములు చూచుచున్నారు. మిల్లు వర్కింగ్ లో ఉన్నది. రికార్డ్ ల గురించి అడుగగా మిల్లు గుమాస్తా ఏ విధమైన రికార్డ్లు చూపలేదు. మిల్లులో పరిశీలించగా కానాలలో బియ్యపు రాశులు (ఫోర్టీఫైడ్ రైస్ ) ఉన్నవి. అంతట బియ్యమును గొనె సంచులలోనికి ఎత్తించి కాటా వేయించగా 110 బస్తాలలో బస్తా ఒకింటికి 50 కిలోల చొప్పున 55 క్వింటాళ్ళ రేషన్ బియ్యం తూగినవి. మిల్లులో పరిశీలించగా ధాన్యం కానీ, తవుడు కానీ, నూక కానీ కనిపించలేదు. విచారణలో మిల్లు యాజమాన్యం వారు రేషన్ బియ్యం అక్రమముగా కొనుగోలు చేసి, నిల్వ వుంచి రీసైక్లింగ్ చేసి అమ్ముచుంటారని తెలియవచ్చినది. మిల్లులోగల 110 బస్తాలలోని 55 క్వింటాళ్ళ రేషన్ బియ్యం (ఫోర్టీఫైడ్ రైస్ ) స్వాధీన పరచుకొని మిల్లు యజమాని శ్రీ గంగాధర రెడ్డి పై “6ఏ ” కేసు నమోదు చేయవలసినదిగా సత్తెనపల్లి సివిల్ సప్ప్లైస్ డిప్యూటీ తహసీల్దార్ (సి ఎస్ డి టి ) ని విజిలెన్స్ ఎన్ఫోర్స్ మెంట్ అధికారులు ఆదేశించినారు.
పై తనిఖీలలో విజిలెన్స్ ఇన్స్పెక్టర్స్ ఎస్. శ్రీనివాసులు రెడ్డి, ఏ.శ్రీహరి రావు, సత్తెనపల్లి సివిల్ సప్ప్లైస్ డిప్యూటీ తహసీల్దార్ (సి ఎస్ డి టి ) మరియు సిబ్బంది పాల్గొన్నారు.
ప్రాంతీయ నిఘా మరియు అమలు అధికారి,
గుంటూరు