◾️ ముందస్తు అనుమతి లేకుండా ప్రజా బహిరంగ కార్యక్రమాలు, సభలు, ర్యాలీలు నిషేధం
◾️ ఈ నెల 30 వరకు జిల్లాలో 30 పోలీస్ యాక్ట్ నిబంధనలు వర్తిస్తాయి, ఉత్తర్వులు జారీ చేసిన జిల్లా ఎస్పీ డి ఉదయ్ కుమార్ రెడ్డి
రిపబ్లిక్ హిందుస్థాన్, ఆదిలాబాద్ :
శాంతిభద్రతల దృష్ట్యా, జిల్లా వ్యాప్తంగా ప్రశాంత వాతావరణ పరిస్థితులను మరింత సవ్యంగా కొనసాగించడానికి శనివారం రోజు నుండి నవంబర్ 30 వరకు జిల్లా అంతటా 30 పోలీస్ యాక్ట్ అమల్లో ఉంటుందని జిల్లా ఎస్పీ డి ఉదయ్ కుమార్ రెడ్డి పేర్కొన్నారు. ఈ మేరకు శనివారం పోలీసు ముఖ్య కార్యాలయం నుండి ఒక ప్రకటన విడుదల చేస్తూ వివరాలు వెల్లడించారు. 30 పోలీస్ యాక్ట్-1861 అమల్లో ఉన్నందున జిల్లాలో డిఎస్పి లేదా పోలీస్ ఉన్నతాధికారుల నుండి ముందస్తు అనుమతి లేకుండా ఏలాంటి ప్రజా సమావేశాలు, ఊరేగింపులు, ధర్నాలు, బహిరంగ సభలు, తదితర ప్రజలు గుమికూడి ఉండేవిధంగా కార్యక్రమాలు నిర్వహించడానికి సన్నాహాలు చేయరాదని తెలిపారు. నిషేధిత ఆయుధాలు, దురుద్దేశంతో నేరాలకు ఉసి కోలిపే ఎటువంటి ఆయుధాలు కల్గిఉండరాదని తెలిపారు. ప్రజా జనజీవనానికి ఇబ్బంది, చిరాకు కల్గించేందుకు దారితీసే ఇబ్బందికర ప్రజా సమావేశాలు, జన సమూహం అలాంటివి పూర్తిగా నిషేధం అన్నారు. లౌడ్ స్పీకర్లు, డీజే లు వంటివి నిషేధమని తెలిపారు. ప్రచార రథాలు, మైకులు, తదితర అధిక శబ్ద పరికరాలు నిషేధించబడినవని సూచించారు. చట్టపరమైన జారీచేసిన ఆదేశాలను ఎవరైనా ఉల్లంఘిస్తే 30 పోలీస్ యాక్ట్ 1861 ప్రకారం శిక్షార్హులు అవుతారని సూచించారు. నిషేధంలో ఉన్న నిబంధనలను తప్పనిసరిగా అందరూ పాటించాలన్నారు, ఏలాంటి కార్యక్రమాలు నిర్వహించాలన్న ముందస్తుగా దరఖాస్తు చేసుకొని అనుమతులు తీసుకోవాలని సూచించారు. 30 పోలీస్ యాక్ట్ అమల్లో ఉన్నందున ఎటువంటి అనుమతులు లేని ర్యాలీలు నిర్వహించిన వారిపై కఠినమైన చర్యలు తప్పవని హెచ్చరించారు.